భారత వైమానిక దళం చరిత్రలో చెరగని ముద్రవేసిన ఫైటర్ జెట్ మిగ్-21 శకం ముగిసింది. 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత మిగ్ ఫైటర్ జెట్లు రిటైర్ అయ్యాయి. భారత వాయుసేనకు కొన్ని దశాబ్దాలుగా వెన్నముక వలే ఉండి, ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన ఈ ఫైటర్ జెట్స్కు చండీగఢ్ వాయుసేన కేంద్రం వేదికగా జరిగిన ఫేర్వెల్ కార్యక్రమంలో వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ నేడు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ అధికారులు, మాజీలు హాజరయ్యారు. మిగ్-21 ఫైటర్ జెట్స్ 1963లో ఐఏఎఫ్లో చేరాయి. భారత వైమానిక దళం ఫైటర్ జాబితాలో మొట్టమొదటి సూపర్సోనిక్ విమానం. అప్పటి నుంచి మిగ్-21 యుద్ధ విమానాలు భారత్కు వెన్నెముకగా నిలిచాయి. 1965, 1971లలో పాకిస్థాన్తో జరిగిన యుద్ధాలు, 1999లో కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్ సహా అనేక కీలక ఆపరేషన్లలో ముఖ్య పాత్ర పోషించాయి. వేగం, చురుకుదనం, పోరాట పటిమతో ఈ విమానం భారత సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయాలు సాధించాయి.


