గతేడాది అహ్మదాబాద్లో భయంకర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిరిండియాకు రూ.1,100 కోట్ల బీమా సొమ్ము తాజాగా లభించింది. విమానం పూర్తిగా ధ్వంసం కావడంతో రీ-ఇన్సూరర్లు, బీమా సంస్థలు 125 మిలియన్ డాలర్ల బీమా మొత్తాన్ని ఎయిరిండియాకు చెల్లించాయి. అలాగే ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు మరో 25 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించే ప్రక్రియ కూడా ప్రారంభమైందని బీమా సంస్థలు తెలిపాయి. అయితే ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, పరిహారం మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించాయి. ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు టాటా గ్రూపు ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చనిపోయిన వారి బంధువులకు పరిహారం ఇవ్వడంతో పాటు, క్షతగాత్రుల వైద్య ఖర్చులు, మెడికల్ కాలేజ్ హాస్టల్ పునరుద్ధరణ, విమాన శకలాల వల్ల దెబ్బ తిన్న ఇతర నిర్మాణాలను పునరుద్ధరించడం వంటి పనులను ఈ ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది.


