అమెరికా వీసా ఇంటర్వ్యూలలో ఏర్పడిన తీవ్ర ఆలస్యాల కారణంగా భారత్లోనే చిక్కుకుపోయిన తమ హెచ్-1బి ఉద్యోగులకు అమెజాన్ సంస్థ ఊరటనిచ్చింది. వీసా సమస్యలతో మానసిక ఒత్తిడిలో ఉన్న సిబ్బందికి తాత్కాలిక వెసులుబాటు కల్పిస్తూ, మార్చి 2 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూ ఎఫ్ హెచ్) చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం వీసా ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులు ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందకుండా ఉండేందుకు తీసుకున్న చర్యగా భావిస్తున్నారు.
వీసా ఆలస్యాల వల్ల ఇప్పటికే ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు వారిని ఇబ్బంది పెడుతున్నాయని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఇతర టెక్ కంపెనీలకు కూడా ఒక మార్గదర్శకంగా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు.


