ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు అనిల్ అంబానీకి చెందిన రూ.3,084 కోట్ల విలువైన 40కిపైగా ఆస్తులను అటాచ్ చేసింది. అక్టోబర్ 31న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో గల అనిల్ అంబానీ నివాసం, న్యూఢిల్లీలోని రిలయన్స్ సెంటర్, ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పూణె, థానే, హైదరాబాద్, చెన్నైల్లో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. కాగా, అనిల్ అంబానీకి చెందిన గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.


