ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ పర్యటనపై కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రధాని మోదీ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యల ఏర్పాట్లపై డీజీపీ పలు సూచనలు చేశారు. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ప్రధాని పర్యటనలో ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటన సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా గట్టి చర్యలు చేపట్టాలని ఆజ్ఞాపించారు. సామాన్య ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వీవీఐపీలు వెళ్లేంతవరకు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమీక్షలో అడిషనల్ డీజీ ఎన్.మధుసూదన్ రెడ్డి, ఐజీ శ్రీకాంత్, డీఐజీలు కోయ ప్రవీణ్, గోపీనాథ్ జెట్టి, సెంథిల్ కుమార్, సత్యయేసు బాబు, ఫక్కీరప్ప కాగినెల్లి, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.


