బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకింగ్ లాస్ సవరణ చట్టం 2025 కింద కొత్త మార్గదర్శకాల ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రకటించింది. బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు, లాకర్లకు నామినేషన్స్, సెఫ్ కస్టడీలోని ఆస్తులపై కస్టమర్లకు నియంత్రణ, సౌలభ్యాన్ని కల్పించేందుకు కీలక మార్పులు జరుగుతున్నాయి. ఈ కొత్త మార్గదర్శకాలు నవంబర్ 1, 2025 నుంచే అమలులోకి వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
డిపాజిట్ అకౌంట్లు, సేఫ్ కస్టడీ వస్తువులు, సెఫ్టీ లాకర్స్ వంటి వాటికి సంబంధించిన నామినేషన్ ఎంపికలో కీలక మార్పులు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ‘బ్యాంకింగ్ లాస్ సవరణ చట్టం 2025లోని సెక్షన్లు 10,11,12,13 కింద ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1, 2025 నుంచే అమలవుతాయి. బ్యాంకింగ్ లాస్ సవరణ చట్టం 2025ని గత ఏప్రిల్ 15, 2025 రోజునే కేంద్రం నోటిఫై చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1935, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ చట్టం 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1955, బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1970లో మొత్తం 19 సవరణలు చేసింది’ అని తన ప్రకటనలో తెలిపింది.


