కెనడా ప్రభుత్వం ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తహవ్వుర్ రాణా ప్రస్తుతం భారత్లో ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నాడు. కాగా 1997లో రాణా కెనడాకు వలస వెళ్లాడు. 2001లో ఇమిగ్రేషన్, రెఫ్యూజిస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా అతడికి కెనడా పౌరసత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆ పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ఐఆర్సీసీ చర్యలు ప్రారంభించింది. దీనికి కారణం అతడిపై ఉన్న ఉగ్ర ఆరోపణలు కాదని, తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందడంపై ఈ చర్యలు చేపట్టామని వివరించింది. పౌరసత్వం కోసం రాణా దరఖాస్తు చేసుకున్న సమయంలో తాను టొరంటో నివాసినని పేర్కొన్నాడు. కానీ, ఆ సమయంలో అతడు షికాగోలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కొన్నేళ్లుగా దర్యాప్తు జరుగుతోంది. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై తహవ్వుర్ 2009లో అరెస్టయ్యాడు. అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన అతడిని యూఎస్ అధికారులు గతేడాది భారత్కు అప్పగించారు.


