ఇండిగో విమానాల రద్దు సంక్షోభం వేళ భారత విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధులపై గతంలో విధించిన ఆంక్షలను సడలించింది. ఇటీవలే అమల్లోకి వచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నియమాల్లోని ముఖ్యమైన ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. గత నాలుగు రోజులుగా విమానాల రద్దుతో ఇండిగో తీవ్ర సతమతమవుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ వందలాది విమానాలు రద్దవుతున్నాయి. దీంతో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నియమాలను సడలించాలని ఇండిగో సంస్థ డీజీసీఏ కి విజ్ఞప్తి చేసింది. ఇండిగో విజ్ఞప్తి మేరకు విమానయాన సంస్థ తాజాగా నిర్ణయం తీసుకుంది. పైలట్ల వీక్లీ రెస్ట్ నిబంధనలో మార్పులు చేసింది. వారాంతపు విశ్రాంతిని లీవ్తో భర్తీ చేయకూడదనే నిబంధనను ఎత్తివేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వీక్లీ రెస్ట్ను సెలవుగా పరిగణించనున్నట్లు తాజాగా డీజీసీఏ ప్రకటించింది. అయితే, ఇవి తాత్కాలికం మాత్రమేనని స్పష్టం చేసింది. డీజీసీఏ నిర్ణయంతో ఇండిగోకు కాస్త ఊరట కలిగినట్లైంది.


