జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. యూసఫ్గూడలోని డీఆర్సీ సెంటర్లో ఈసీ అధికారులు సిబ్బందికి ఈవీఎంలను, పోలింగ్ స్టేషన్లను కేటాయించారు. ఎన్నికల సిబ్బంది సాయంత్రం లోగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు. ప్రతి అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లు ఆయన పేర్కొన్నారు.
3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో కలిపి మొత్తం 5 వేల మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఈ నెల 14న తేలనుంది.


