విశాఖలో ఈనెల 14, 15 తేదీలలో జరిగే 30వ పార్టనర్ షిప్ సమ్మిట్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. పార్టనర్ షిప్ సమ్మిట్పై ఏపీ కేబినెట్ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. ఈనెల 14న తొలిరోజు ఓపెనింగ్ ప్లీనరీతో సదస్సు ప్రారంభంకానుంది. ఓపెనింగ్ ప్లీనరీలో తీవ్రమైన ప్రతికూల పరిస్ధితులు, ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ భారత్ 65 శాతం వృద్ధి రేటును సాధించిన అంశంపై చర్చ జరుగనుంది. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో కేంద్రం ప్రభుత్వం నుంచి మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, అశ్వినీ వైష్ణవ్, అన్నపూర్ణాదేవి, జితేంద్ర సింగ్లు హాజరుకానున్నారు. అలాగే ఈ సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన 8 మంది స్పీకర్లు ఈ సదస్సులో పాల్గొంటారు. పార్టనర్ షిప్ సమ్మిట్లో ఒక ప్లీనరీ సెషన్, సీఐఐ ద్వారా జరిగే టెక్నికల్ సెషన్లు 27, రాష్ట్ర స్థాయిలో సీఐఐతో కలిసి సంయుక్తంగా 11 సెషన్లు జరుగనున్నాయి.
దేశీయ అంశాలతో 5 సెషన్లు, ఒక వీడ్కోలు సెషన్లతో సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సు ద్వారా 9 లక్షల 76 వేల 248 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా వేయగా, దాదాపు 7 లక్షల 48వేల 427 మందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ సదస్సులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 30 ప్రాజెక్టులు ప్రారంభించనుండగా, 82 ప్రాజెక్టులకు శంఖుస్థాపనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.


