బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ను ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్-1 దోషిగా తేల్చింది. ఆమెకు మరణశిక్ష విధించింది. 2024 జూలై, ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, 24,000 మంది గాయపడ్డారని ఐసీటీ న్యాయమూర్తి పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన అభియోగాలపై ఐసిఆర్ తాజా తీర్పునిచ్చింది. తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు.
నిరసనల అణిచివేతకు హసీనా ప్రభుత్వం ఫైర్ఆర్మ్స్, హెలికాప్టర్లు సహా మారణాయుధాలను మోహరించిందని, ఫలితంగా పెద్దఎత్తున హింస చెలరేగి, మారణహోమం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. హసీనాకు, దక్షిణ ఢాకా మున్సిపల్ కార్పొరేషన్కు మధ్య జరిగిన సంభాషణలను కూడా ఆయన చదివి వినిపించారు. ప్రజలను రజాకార్లుగా, ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేసి హింసను హసీనా రెచ్చగొట్టారని, ఆమెపై అభియోగాల నిర్ధారణకు తగిన ఆధారాలున్నాయని చెప్పారు. జూలై 14న మీడియా సమావేశంలో కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు.


