శబరిమల వంటి ప్రసిద్ధ దేవాలయం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసం, మండల దీక్ష సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే, శబరిమల ఆలయానికి నేరుగా వెళ్లలేని భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆన్లైన్ లో ప్రసాదం బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. భక్తులు తమ ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా స్వామివారి ప్రసాదాలు బుక్ చేసుకునే సదుపాయాన్ని మరో నెలలో ప్రారంభించనుంది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నూతనంగా కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ ద్వారా అందుబాటులోకి తెస్తోంది. ఈ కొత్త సదుపాయంతో శబరిమల ఆలయంతో పాటు ట్రావెన్కోర్ దేవస్వం పరిధిలోని 1252 ఆలయాల ప్రసాదాలు కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా తమ ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం ముఖ్యంగా శబరిమల వంటి రద్దీగా ఉండే ఆలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు తెలిపారు.


