తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు కొండకు తరలివస్తుంటారు. తిరుమల శ్రీవారు ఎంత ఫేమస్సో, శ్రీవారి లడ్డూ కూడా అంతే ఫేమస్ అని చెప్పుకోవాలి. శ్రీనివాసుడిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి తీసుకుంటారు భక్తులు. అయితే గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తిరుమల లడ్డూను పెంచేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీవారి ధరల పెంపు ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చారు.
శ్రీవారి లడ్డూ ధరలను పెంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లడ్డూ ధరల పెంపు వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. కావాలనే కొన్ని ఛానళ్లు పని గట్టుకొని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై కొన్ని ఛానళ్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయ్యారు. లడ్డూ ధరలను పెంచే ఉద్దేశం టీటీడీకి లేదని స్పష్టం చేశారు. టీటీడీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.


