భారత తొలి మిస్ ఇండియా, ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో (81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు కార్ల్, కోడలు నిషా, కుమార్తె క్రిస్టినా ఉన్నారు. ముంబైలో జన్మించిన మెహర్, 1964లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారు. అనంతరం మిస్ యూనివర్స్, మిస్ యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ అందాల పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
మోడలింగ్ తర్వాత ఫ్యాషన్ జర్నలిజంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. 1973లో ఈవ్స్ వీక్లీ లో తొలి కథనంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనతికాలంలోనే ఫ్యాషన్ కాలమిస్టుగా ఎదిగి, దాదాపు 160 జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్లలో వ్యాసాలు రాశారు. మ్యాన్స్టైల్, ఫ్యాషన్ కెలిడోస్కోప్ వంటి పుస్తకాలు కూడా రచించారు. భారతదేశంలో ఫ్యాషన్ జర్నలిజానికి ఆమెను మార్గదర్శకురాలిగా పరిగణిస్తారు. లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి అనేక ప్రధాన ఫ్యాషన్ ఈవెంట్లకు ఆమె అధికారిక ఫ్యాషన్ రైటర్గా పనిచేశారు. ఫ్యాషన్ను కేవలం సెలబ్రిటీల గ్లామర్గా కాకుండా, ఒక పరిశ్రమగా విశ్లేషించిన తొలితరం జర్నలిస్టులలో ఆమె ఒకరు. యువ డిజైనర్లను, రచయితలను ఎంతగానో ప్రోత్సహించిన మెహర్, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లలో జడ్జిగా, స్పీకర్గా కూడా సేవలందించారు. ఆమె మృతితో భారత ఫ్యాషన్ రంగం ఒక ప్రముఖురాలిని కోల్పోయింది.


