ఇస్లామిక్ సుప్రీంనేత సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దేశంలోని పలు నగరాల్లో భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, రోజు వారీ ఖర్చులు పెరిగిపోవడంతో జనం రోడ్లమీదకు వచ్చేశారు. వీధుల్లో ఖమేనీకి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. తాజా నిరసనలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ గురించి కాకుండా తన సొంత దేశంలోని సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా నిరసనకారులను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మరో దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టేందుకు సొంత దేశాన్ని నాశనం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. యువత ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అప్పుడే శత్రువును ఎదుర్కోగలం అంటూ పేర్కొన్నారు.


