జూబ్లీహిల్స్ బైఎలక్షన్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత పేరు ఖరారైంది. మాగంటి సునీత పేరును పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకే సునీతకు అవకాశం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థనేతగా, మాగంటి గోపీనాథ్ నిబద్ధతను పరిశీలించామని కేసీఆర్ పేర్కొన్నారు. అన్నింటిని గమనించి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తున్నాన్నారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2025, జూన్ 8వ తేదీన గుండెపోటు కారణంగా ఆయన చనిపోయారు. జూన్ 5వ తేదీన ఆయన గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ని బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ జూన్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు. గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యం అయింది.


