గిరిజన ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర మరోసారి భక్తుల మనసులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామం జనవరి మధ్య నుంచి ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. కోట్లాది మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు అడవిబాటలు తొక్కుతూ వచ్చే ఈ జాతర, గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలు, ప్రకృతి ఆరాధనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ మహా ఉత్సవంలో వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలతో పాటు జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజులు ప్రత్యేక ఆచారాల మధ్య గద్దెలపై కొలువుదీరుతారు.
జాతరకు రెండు వారాల ముందే ఆచారాలు ప్రారంభమవుతాయి. గుడిమెలిగే, మండమెలిగే పండుగలతో మేడారం ప్రాంతం పూర్తిగా జాతర మూడ్లోకి వెళ్తుంది. జనవరి చివరి వారంలో వనదేవతలు ఒక్కొక్కరిగా మేడారానికి చేరుకోవడం, గద్దెలపై ప్రతిష్ఠ జరగడం, భక్తుల పూనకాలు, శివసత్తుల నృత్యాలతో అడవి ప్రాంతం దద్దరిల్లుతుంది. ముఖ్యంగా చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క దేవత గద్దెకు చేరే ఘట్టం భక్తులకు అత్యంత పవిత్రమైన క్షణంగా భావిస్తారు. అనంతరం బెల్లం మొక్కులు సమర్పించి, చివరగా దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
జనవరి 14: గుడిమెలిగే పండుగ – దేవతలకు ప్రత్యేక పూజలు
జనవరి 21: మండమెలిగే పండుగ -జాతర విజయార్థం ప్రార్థనలు
జనవరి 27: పగిడిద్దరాజు, జంపన్న మేడారానికి ప్రయాణం
జనవరి 28: సారలమ్మ, గోవిందరాజులు గద్దెలపై కొలువు
జనవరి 29: సమ్మక్క దేవత గద్దెపై ప్రతిష్ఠ (ప్రధాన ఘట్టం)
జనవరి 30: బెల్లం మొక్కుల సమర్పణ
జనవరి 31: దేవతల వనప్రవేశం
ఫిబ్రవరి 4: తిరుగువారం పండుగతో ఉత్సవాల ముగింపు.


