టోల్ వసూలు వ్యవస్థపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపు కనుమరుగవుతుందని వెల్లడించారు. దాని స్థానంలో సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం లో నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత టోల్ వసూళ్ల వ్యవస్థ ఏడాదిలోపు ముగుస్తుంది. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇక టోల్ కోసం ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. కొత్తదాంతో హైవేలో ప్రయాణించేవారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఈ కొత్త వ్యవస్థను ఇప్పటికే 10 చోట్ల ప్రవేశపెట్టాం. ఏడాదిలోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తాం అని లోక్సభకు తెలిపారు.


