వేంకటేశ్వర స్వామి తన ఇంటి కులదైవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం అని అన్నారు. ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగాయని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని చెప్పామని సూచించారు. 2003 లో తనపై హత్యాయత్నం జరిగిందని, అదీ అలిపిరి వద్ద అని విమర్శించారు. అంతర్వేదిలో రథం తగలబెట్టి, తిరిగి తమపై కేసులు పెట్టారని మండిపడ్డారు.
అది తనకు పునర్జన్మ, సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి కృపతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. నెయ్యిలో పొరపాట్లు జరుగుతున్నట్లు, ఎన్ డిడిబి రిపోర్టు ఇచ్చిందని అన్నారు. చర్యలు తీసుకోకుండా, తమ పార్టీపై విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. క్షమాపణలు తాము చెప్పాలా? బూతులు తాము భరించాలా? అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో, కెమికల్స్ తో నెయ్యిని తయారు చేశారని సిట్ రిపోర్టు ఇచ్చిందని, తిరుమల లడ్డూ సిబిఐ రిపోర్టులో కల్తీ జరగలేదని ఎక్కడా లేదని అన్నారు. వైసిపి హయాంలో తిరుమల రావాలన్నా, లడ్డూ తినాలన్నా భక్తులు భయపడ్డారని తెలియజేశారు. దోషులను శిక్షిస్తామని, ఎవరినీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు.


