దేశీయంగా అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసుల్లో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజూ దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇండిగో సంక్షోభం వేళ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దుతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు అనుసంధానించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్లు పెంచింది. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్లు ఏర్పాటు చేసింది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటూ ప్రయాణికుల కోసం అదనంగా నాలుగు ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. విమానాల రద్దుతో సతమతమవుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది.


