అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం సీతా పయనం. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ వెండితెరకు కథానాయికగా పరిచయం అవుతుండటం విశేషం. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించగా, అర్జున్ స్వయంగా ఒక ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. అలాగే ఆయన మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా కూడా ఈ మూవీలో స్పెషల్ కామియో రోల్లో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్ను సొంతం చేసుకుంది. సాంకేతికంగా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది. జి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా పదునైన డైలాగ్స్ రాశారు. యాక్షన్ కింగ్ సినిమా అంటేనే ఫైట్స్ స్పెషల్గా ఉంటాయి కాబట్టి, ఈ చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వినూత్న ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకుల్లోకి వెళ్తున్న మేకర్స్, త్వరలోనే సినిమా థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.


