తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని సవరించే ఆర్డినెన్స్పై ఆ శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారు. కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆర్డినెన్స్ బిల్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గరకు వెళ్లనుంది. గవర్నర్ ఈ బిల్లును ఆమోదిస్తే వచ్చే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది. 1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడానికి ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది. 1994 తర్వాత మూడో సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా మారారు.


