ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం చెప్పారు కవిత. శాసనమండలి నుంచి బయటకు వచ్చిన తరువాత గన్పార్క్ వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థనే కొత్త పార్టీగా అవతరించనుందని ప్రకటించారు. రాజకీయంగా అందరూ మద్దతు ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పార్టీ విధివిధానాలను ప్రకటిస్తానన్నారు. ఇంటి పార్టీ నుంచి అవమాన భారంతో బయటకు వస్తున్నానని, గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. సమస్యలపై పోరాడుతామన్నారు. రాజకీయాల్లో మార్పు తెచ్చే వేదికగా జాగృతి అవతరిస్తుందన్నారు.
అంతకుముందు శాసనమండలిలో మాట్లాడిన కవిత కన్నీటిపర్యంతం అయ్యారు. ఇదే తన చివరి ప్రసంగం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓ వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని, బలమైన శక్తిగా తిరిగి చట్టసభలకు వస్తానంటూ కవిత చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ మండలి ఛైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. అయితే, ఎమ్మెల్సీ కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె కొత్త పార్టీపై కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి తెరపడింది.


