హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదం నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. నగర ప్రజలు నుమాయిష్ పర్యటనను ఈ రోజుకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాంపల్లి స్టేషన్ రోడ్లో అగ్నిప్రమాద ప్రభావం వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడకుండా వాహనాలను ఇతర మార్గాల్లోకి దారి మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని సీపీ తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమన్వయంతో పనిచేశారన్నారు. ప్రస్తుతం భవనంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, అయితే ఫర్నిచర్, రసాయనాలు దగ్ధం కావడంతో భవనం అంతా దట్టమైన పొగ అలుముకుందన్నారు. దీనివల్ల రెస్క్యూ టీమ్లు లోపలికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం స్టేషన్ రోడ్ మార్గంలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.


