ఇరాన్ ,ఇజ్రాయెల్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు యుద్ధ మేఘాలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వరుస హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా ఇరాన్లో అంతర్గత అల్లర్లు, ఇజ్రాయెల్పై దాడుల భయం మధ్య భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం ఇజ్రాయెల్లో ఉన్న సుమారు 18,000 మంది భారతీయ పౌరులను అప్రమత్తం చేసింది. ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఇజ్రాయెల్కు అత్యవసరం కాని ప్రయాణాలను పూర్తిగా నిలిపివేయండి. ఇప్పటికే ఇక్కడ ఉన్నవారు స్థానిక అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ ఇచ్చే భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి అని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఇరాన్లో పెరుగుతున్న నిరసనలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల దృష్ట్యా, అక్కడ ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న విమానాల ద్వారా వెంటనే ఆ దేశాన్ని విడిచి పెట్టాలని కేంద్రం ఆదేశించింది. ఇరాన్లో ఇంటర్నెట్ అంతరాయం ఉన్నందున.. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ నమోదు చేసుకోవాలని కోరింది. అల్లర్లు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, పాస్పోర్ట్ వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.


