కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) గాను ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రతియేటా కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తేదీన సమర్పిస్తారన్న విషయం తెలిసిందే. 2017 నుంచి ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సారి కూడా అదే తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అదే సమయంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తేదీలు కూడా ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే, ఈ సారి బడ్జెట్లో మధ్యతరగతి, రైతులు, యువత, మహిళలు, వ్యవసాయం, తయారీ రంగాలు, ఉపాధి సృష్టి వంటి అంశాలపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్పై అన్ని వర్గాల ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.


