ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మెట్రో ఫేజ్ 5(ఏ) విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.12,015 కోట్లు కేటాయించారు. 13 కొత్త స్టేషన్లను కలుపుతూ 16 కిలోమీటర్ల మేరకు ఈ విస్తరణ పనులు చేపడతారు. దీంతో రాబోయే మూడేళ్లలో ఈ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ 400 కిలోమీటర్ల మార్క్ను చేరనుంది. ఫేజ్ 5 (ఏ)లో భాగంగా 16 కిలోమీటర్ల మేర 3 నూతన కారిడార్లను ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ (డీఎంఆర్సీ) నిర్మించనున్నట్టు కేబినెట్ సమావేశానంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఢిల్లీ మెట్రో చరిత్రలో ఇదొక మైలురాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో 33,000 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని, రాబోయే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ మెట్రో ఆపరేషనల్ లెంగ్త్ 400 కిలోమీటర్లను అధిగమిస్తుందని, ప్రపంచంలోనే అతి పెద్ద అర్బన్ రైల్ నెట్వర్క్గా నిలుస్తుందని వివరించారు.


