అమెరికా లో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నార్త్ కరోలినా రాష్ట్రంలో జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం నార్త్ కరోలినాలోని సౌత్పోర్ట్ యాచ్ బేసిన్ సమీపంలో ఉన్న అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ వద్ద ఈ దాడి జరిగింది. గుర్తు తెలియని ఒక వ్యక్తి బోటులో రెస్టారెంట్ వద్దకు చేరుకున్నాడు. బోటులో ఉన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా రెస్టారెంట్ను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు తాను వచ్చిన బోటులోనే పారిపోయినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతులు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది.


