చైనా రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం స్పందించింది. ఆ వాదనలు నిరాధారమని పేర్కొంది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ బీజింగ్ ఎప్పుడూ శాంతియుత అభివృద్ధి మార్గానికి కట్టుబడి ఉందన్నారు. అణ్వాయుధాల విషయానికి వస్తే, కఠినమైన నో ఫస్ట్ యూస్ అనే విధానాన్ని అనుసరిస్తుందని తెలిపారు. చైనా అణు వ్యూహం పూర్తిగా రక్షణాత్మకమైనది, అన్ని అణు పరీక్షలపై తాత్కాలిక నిషేధాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
చైనా అంతర్జాతీయ కమిట్మెంట్స్కు కట్టుబడి ఉందని, ప్రపంచశాంతి, స్థిరత్వాన్ని నిలబెట్టడంలో చురుకైన పాత్ర పోషిస్తూనే ఉంటుందని మావో పేర్కొన్నారు. అణు సమస్యలపై చైనా నిరంతరం బాధ్యతాయుతమైన వైఖరిని కొనసాగిస్తుందని ఆమె తెలిపారు. బీజింగ్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. మూడు దశాబ్దాలకుపైగా తొలిసారిగా అమెరికా తన సొంత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించిన తర్వాత.. అణు పరీక్షలపై మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చైనా స్పందించింది.


