మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మొంథా తుఫాను బాధితులను పరామర్శించే అర్హత లేదని మంత్రి ఎస్ సవిత అన్నారు. మీడియాతో మాట్లాడుతూ తుఫాను ఎప్పుడు రాష్ట్రంపై ప్రభావం చూపుతన్నా ఆయన రాష్ట్రంలో ఉండరని విమర్శించారు. తుఫాను నష్టం అంచనాలు పూర్తయి కేంద్రానికి నివేదిక కూడా వెళ్లిపోయాక ఇప్పుడు పరామర్శ అంటూ జగన్ వెళుతున్నారని మండిపడ్డారు. రైతులను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆదుకున్న పార్టీ టీడీపీ, కూటమి ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.
జగన్ అధికారంలో ఉండగా అమరావతి రైతులను ముప్పుతిప్పలు పెట్టారని, ఇప్పుడు రైతుల పరామర్శ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయంలో కేంద్రం ఇచ్చే సాయంతో కలుపుకుని ఏడాదికి ఇచ్చింది రైతుభరోసాగా రూ.13,500 మాత్రమే అని చెప్పుకొచ్చారు. కానీ కూటమి సర్కార్ ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద అందిస్తోందని, రైతుల సంక్షేమం చూస్తోందని తెలిపారు. రైతు అమ్మిన ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా జగన్ సర్కార్ ఎగవేస్తే వాటిని కూటమి తీర్చిందని చెప్పారు. పంట కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తోందని పేర్కొన్నారు.


