హైదరాబాద్ అభివృద్ధికి రీజినల్ రింగు రోడ్
హైదరాబాద్ను ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కత్తా వంటి మెట్రో నగరాల స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రధాన ప్రాజెక్టే రీజినల్ రింగు రోడ్ (RRR). ఈ రహదారిని తెలంగాణలోని సూపర్ గేమ్ ఛేంజర్గా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు సుమారు 40 కిమీ దూరంలో రెండు భాగాలుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
దక్షిణ భాగం: చౌటుప్పల్ – కంది (సంగారెడ్డి) వరకు, ఓఆర్ఆర్కు సమాంతరంగా, పొడవు 182 కిమీ.
మొత్తం 340 కిమీ పొడవుతో ఈ రింగు రోడ్ నిర్మితమవుతుంది.
ఉత్తర భాగం: సంగారెడ్డి – గజ్వేల్ – భువనగిరి – చౌటుప్పల్ వరకు, పొడవు 158 కిమీ.


కీలక ముందడుగు – డీపీఆర్ కేంద్రానికి
ఉత్తర భాగానికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఎట్టకేలకు కేంద్రానికి చేరింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సమర్పించిన ఈ నివేదిక ప్రకారం రహదారి నిర్మాణానికి రూ.8,000 కోట్ల వ్యయం అవుతుందని, భూసేకరణకు అదనపు నిధులు అవసరమని పేర్కొంది. ప్రస్తుతం ఈ డీపీఆర్ ప్రాజెక్టు అప్రైజల్ టెక్నికల్ కమిటీ పరిశీలనలో ఉంది. కమిటీ ఆమోదం లభిస్తే తదుపరి దశలో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ కమిటీ, ఆపై కేంద్ర మంత్రివర్గానికి వెళ్తుంది. చివరికి క్యాబినెట్ ఆమోదం తర్వాతే ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది.
టెండర్లు, వరుసలు పెంపు
ఉత్తర భాగంలోని 4 వరుసల రహదారి పనులకు సంబంధించి టెండర్ల గడువును NHAI సెప్టెంబర్ 3, 2025 వరకు పొడిగించింది. గత సంవత్సరం డిసెంబర్లో టెండర్లు పిలిచినా సాంకేతిక సమస్యల కారణంగా బిడ్లు తీయలేకపోయారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 4 వరుసల బదులుగా 6 వరుసల రహదారిగా మార్చాలని కోరడంతో, NHAI తిరిగి ట్రాఫిక్ సర్వే నిర్వహించి ఈ ప్రతిపాదనను ఆమోదించింది.

మొత్తం పరిస్థితి
2016లో మంజూరైన ఈ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు ఎన్నో ఆలస్యాల తర్వాత ఉత్తర భాగంలో కీలక దశకు చేరింది. ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో రవాణా సౌకర్యాలు మరింత వేగవంతం కావడంతో పాటు హైదరాబాద్ దేశవ్యాప్తంగా ఒక ప్రధాన రవాణా కేంద్రంగా మారనుంది.

