నూతన రాజకీయ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. మేడ్చల్లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలోనే పార్టీ పేరును కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా సమయానికి చేరుకోవాలని, ప్రతి గ్రామం నుంచి తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ఆడబిడ్డల్లో మార్పు తేవడానికి ఓ మహిళగా ఈ పార్టీని పెడుతున్నానని తెలిపారు. బీసీ బిల్లు సాధించడం తమ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజకీయాలను శ్రీరాముడి స్ఫూర్తితో గమనించాలని కవిత అన్నారు. నేను నిజామాబాద్ బిడ్డను. ఈ మట్టి మంచిది. ఇక్కడి నుంచి తీసుకునే ఏ నిర్ణయమైనా సక్సెస్ అయింది అన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు, నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించలేకపోయమన్నారు. రోజు ప్రజల అవస్థలు చూశామని వ్యాఖ్యానించారు. అందుకోసమే ఓ కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అందరూ మెచ్చేలా పార్టీ ఉంటుందని, సర్వోదయ తెలంగాణ రావాలని కవిత కాంక్షించారు.


