విశాఖపట్నం నుంచి మాకవరపాలెం వరకూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోడ్ షోకు అనుమతి ఇవ్వలేమని అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ప్రకటించారు. మాకవరపాలెంలో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడానికి ఈ నెల 9వ తేదీన జగన్ రానున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ విశాఖ నుంచి మాకవరపాలెం వరకు 63 కిలో మీటర్ల జాతీయ రహదారిపై కాన్వాయ్తో రావడానికి వైసీపీ శ్రేణులు అనుమతులు కోరినట్లు తెలిపారు. విశాఖ నుంచి మాకవరపాలెం వరకు హెలికాప్టర్పై మాజీ సీఎం జగన్ వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు. జాతీయ రహదారి రోడ్డు మార్గంలో కూడళ్ల వద్ద జన సమీకరణ చేసే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు మార్గంలో మాజీ సీఎం జగన్ పర్యటించేందుకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. మాకవరపాలెం మెడికల్ కళాశాల వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేసి జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వచ్చేలా అనుమతి ఇచ్చామన్నారు.


