కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీని. నేను సంగారెడ్డికి పిలిచి అవమానించానేమో అని ఫీల్ అయ్యాను. నాకోసం ఆయన సంగారెడ్డికి వచ్చారు. నన్ను గెలిపించాలని గట్టిగా ప్రచారం చేశారు. అంతగా ఆయన ప్రచారం చేసినప్పటికీ ఇక్కడి ప్రజలు నన్ను ఓడించారు. నేను చాలా ఆవేదన చెందాను. అందుకే సంగారెడ్డిలో నేను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయను అని అన్నారు.
రాహుల్ గాంధీ నా భుజంపై చేయివేసి జగ్గారెడ్డిని గెలిపించాలని అడిగితే, నన్ను ఇక్కడి వారు ఓడించారు. నా జీవితంలో ఈ ఓటమి మరిచిపోలేనిది. నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు. సంగారెడ్డిలోని మేధావులు, కొందరు పెద్దలు మాత్రమే. రేపటి రోజు సంగారెడ్డిలో నా భార్య నిర్మలా పోటీచేసినా నేను ప్రచారానికి రాను. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తాను. కానీ, సంగారెడ్డిలో మాత్రం చేయను అంటూ జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.


