అరబ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ వెల్లడించింది. నిషేధించిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య పరిణామాలు, అంటువ్యాధులు వంటి అంశాలను సమీక్షించి ఈ నిషేధం విధించినట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ వెల్లడించింది. దాదాపు 40 దేశాల నుంచి పౌల్ట్రీ, గుడ్లపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నది. ఈ జాబితాలో భారత్తో పాటు అఫ్గానిస్థాన్, చైనా, జర్మనీ, ఇండోనేసియా, యూకే, జపాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు ఉన్నాయి. ఇవేగాక మరో 16 దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాలపై పాక్షిక ఆంక్షలు విధించింది. ఆస్ట్రేలియా, అమెరికా, ఇటలీ, భూటాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలపై ఈ పాక్షిక ఆంక్షలు అమలవుతాయని తెలిపింది.


