రాజ్యసభ లో తొలిసారి ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు. పశ్చిమబెంగాల్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఒకరు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఉన్నారు. ఆమెనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి. మేనకా గురుస్వామిని రాజ్యసభ సభ్యత్వానికి అభ్యర్థిగా ఎంపిచేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్లో అయిదు స్థానాలు ఖాళీ అవుతుండగా, అందులో నాలుగు తృణమూల్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీఎంసీ,రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్ మల్లిక్లను తన అభ్యర్థులుగా ప్రకటించింది.
మేనకా గురుస్వామి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. 2018లో స్వలింగ బంధాల గురించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆ బంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇవ్వడంలో మేనకా గురుస్వామి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆమె రాజ్యసభకు ఎన్నికైతే,పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్జీబీటీక్యూ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు.


