అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో చేపట్టబోయే చైనా పర్యటనకు ముందు, ఇరు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధులు పారిస్లో సమావేశమయ్యారు. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ , చైనా వైస్ ప్రీమియర్ హీ లిఫెంగ్ నేతృత్వంలో ఆదివారం ఈ ఆర్థిక చర్చలు ప్రారంభమయ్యాయి. మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు ట్రంప్ బీజింగ్లో పర్యటించే అవకాశం ఉందని వైట్ హౌస్ ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది.
అమెరికన్ రైతులు మరియు కార్మికులకు మేలు చేసేలా ఒప్పందాలు ఉండాలని బెసెంట్ బృందం లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది విధించిన సుంకాలు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో కొత్తగా మొదలైన వాణిజ్య దర్యాప్తుపై చర్చలు జరగనున్నాయి. హార్ముజ్ జలసంధి భద్రత, చమురు సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆందోళనలను కూడా చర్చించే అవకాశం ఉంది. అమెరికా చేపట్టిన కొత్త వాణిజ్య దర్యాప్తులను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ప్రపంచ సరఫరా గొలుసు స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని బీజింగ్ హెచ్చరించింది. అయినప్పటికీ, ఈ పారిస్ సమావేశం ఇరు దేశాల మధ్య విభేదాలను తగ్గించి, ఉన్నత స్థాయి చర్చలకు బలమైన పునాది వేస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.


