పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మూడో వారానికి చేరాయి. పశ్చిమాసియాలో పొరుగుదేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. డ్రోన్ దాడులతో అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఈ నేపధ్యంలో సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఒక డ్రోన్ ఇంధన ట్యాంక్ను లక్ష్యంగా ఢీకొట్టడం కారణంగా, భారీ మంటలు చెలరేగాయి. ఫలితంగా దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధికారులు అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేసి, విమానాశ్రయాన్ని మూసివేసినట్లు ప్రకటించారు. ప్రయాణికులు, సిబ్బందికి భద్రతా సూచనలు జారీ చేయబడ్డాయి. అదనంగా, విమానాల స్టేటస్ తెలుసుకోవడానికి సంబంధిత ఎయిర్లైన్స్ను సంప్రదించాలని సూచించారు. ఎయిర్పోర్ట్ అధికారులు కొన్ని విమానాలను అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు ఇంధన ట్యాంక్పై చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర శ్రమ సాగిస్తున్నారు.
విమానాశ్రయం సమీపంలో డ్రోన్ ఘటన కారణంగా ఫ్యూయల్ ట్యాంక్లలో ఒకదానిపై ప్రభావం పడింది. సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకున్నాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా, దుబాయ్ సివిల్ ఏవియేషన్ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ విమానాశ్రయంలో రాకపోకలు ఆగడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు విమాన సిబ్బందిని, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ దాడికి బాధ్యులు ఎవరు అనేది యూఏఈ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.


