రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడారు. తన ప్రసంగంలో విపక్షాలను ఆయన తప్పుపట్టారు. బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు వ్యవస్థీకృత ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాయిదా రాజకీయాలను మోదీ సర్కారు ప్రోత్సహించదన్నారు. దక్షిణాది రాష్ట్రాలను విపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయని, జనాభాను నియంత్రించిన దక్షిణాదితో పాటు చిన్న రాష్ట్రాలకు మోదీ సర్కారు అందించే బెస్ట్ డీల్ ఇదే అని ఎంపీ సూర్య పేర్కొన్నారు.
తాను దక్షిణాది రాష్ట్రం కర్నాటకు చెందిన వ్యక్తి అని, గడిచిన మూడు రోజుల నుంచి వ్యవస్థీకృతంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని, దక్షిణ భారతంలో విపక్షాలు అరాచక రీతిలో వ్యవహరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. డీలిమిటేషన్ అనేది బ్యాక్డోర్ ఎక్సర్సైజ్ కాదు అని, రాజ్యాంగం ప్రకారం అనుసరిస్తున్నామని అన్నారు. ఒకవేళ రాజ్యసభ సీట్లను స్తంభింపచేసి, మహిళా రిజర్వేషన్ను అమలు చేస్తే, అప్పుడు ఆర్టికల్ 81 ప్రకారం వన్ పర్సన్, వన్ ఓట్, వన్ వాల్యూ నినాదం ఓడిపోతుందన్నారు.


