ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు దశకు చేరుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిన తర్వాత ఇరాన్తో యుద్ధానికి సిద్ధమవుతామని ప్రకటించారు. కాల్పుల విరమణ గడువు ముగిసేలోగా ఒప్పందం కుదరకపోతే, ఇరాన్తో తిరిగి యుద్ధానికి వెళ్లడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని ట్రంప్ ప్రకటించారు. ఇస్లామాబాద్లో ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య రెండో దఫా శాంతి చర్చలు జరగాల్సి ఉంది. అయితే బెదిరింపుల నీడలోనూ, అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతున్న నేపథ్యంలోనూ చర్చలు జరపబోమని టెహ్రాన్ స్పష్టం చేసింది. ముందుగా అమెరికా తన చర్యలను ఆపాలని డిమాండ్ చేసింది.
ఇరాన్తో తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకునే వరకు నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. డీల్ కుదరకపోతే మళ్లీ యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. డీల్ ద్వారానే శాంతి, భద్రత, రక్షణ చేకూరుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ కోసం మంచి డీల్ సిద్ధం చేస్తున్నామని, తమ డీల్ చూసి ప్రపంచమే గర్వపడుతుందని అన్నారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం అమెరికా సాధించిన విజయమని పేర్కొన్నారు.


