అమెరికాలోని న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన పికిల్బాల్ టోర్నమెంట్ ఘన విజయం సాధించింది. వివిధ ప్రాంతాల నుంచి పికిల్బాల్ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ టోర్నీకి తెలుగు కుటుంబాలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను ఆసక్తిగా వీక్షించారు. టోర్నీలో విజేతలకు 500 డాలర్లు, రన్నరప్లకు 250 డాలర్లు, ద్వితీయ రన్నరప్లకు 150 డాలర్ల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.
ఈ సందర్భంగా తానా కోశాధికారి రాజా కసుకుర్తి మాట్లాడారు. అమెరికా, భారతదేశంలో తానా నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. విద్య, యువత అభివృద్ధి, ఆరోగ్య అవగాహన, విపత్తు సహాయం, ఆహార పంపిణీ, విద్యార్థుల మార్గదర్శకత్వం, రైతు సంక్షేమ కార్యక్రమాలు వంటి అనేక రంగాలలో తానా చేస్తున్న సేవలను ఆయన ప్రస్తావించారు. తానా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి కృషి చేసిన ఆటగాళ్లు, వలంటీర్లు, నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమ సమన్వయంలో హరి బాబు గంగవరపు (ఎన్జీ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్), ప్రవీణ్ కల్వకొల్లు (ఎన్జీ తానా కేర్స్ కోఆర్డినేటర్), రవి మాచర్ల (ఎన్జీ టీమ్ స్క్వేర్ చెయిర్) కీలక పాత్ర పోషించారు. తానా అధ్యక్షుడు డా.నరేన్ కోడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు, కోశాధికారి రాజా కసుకుర్తి, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ చంద్ నారేపలుపు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావా, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక, న్యూజెర్సీ ప్రాంతీయ మాజీ ప్రతినిధి రామకృష్ణ వాసిరెడ్డి, తానా వాలంటీర్లు దశరథ్ తాళ్లపనేని, హరీష్ కోయల సహకారంతో ఈ టోర్నీని నిర్వహించారు.


