జనసేన కనుమరుగు అవుతుందేమో గానీ, కమ్యూనిజం చచ్చిపోదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ మీడియా సమావేశంపై ఆయన విమర్శలు గుప్పించారు. నేను, మా నాన్న కమ్యూనిస్టులమని పదేపదే చెప్పావు, మరి ఆ కమ్యూనిజం ఎక్కడికి పోయింది పవన్? సనాతన ధర్మాన్ని ఎవరు అవమానించారు? ప్రపంచ కార్మికులారా విడిపోండి అని మేము పిలుపునిచ్చామా? మమ్మల్ని ఎందుకు లాగారు? కమ్యూనిజం చచ్చిపోయిందని ఎవరు చెప్పారు? జనసేన కనుమరుగు అవుతుందేమో గానీ, కమ్యూనిజం చచ్చిపోదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే వచ్చి సవాల్ విసరడం అంటే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడమే అని కూనంనేని అన్నారు.


