ఫేస్బుక్ ప్రేమ, మతాంతర వివాహం, కిడ్నాప్, పోక్సో కేసులతో జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన కుంభమేళా మోనాలిసా ఉదంతంలో కేరళ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దలను ఎదిరించి ముస్లిం యువకుడిని పెళ్లాడిన తనకు, తన భర్తకు పుట్టింటివారి నుంచి తీవ్ర ప్రాణహాని ఉందంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఈ రిట్ పిటిషన్పై తుది నిర్ణయం వచ్చేంత వరకు సదరు యువతికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిందిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జులై 10వ తేదీకి వాయిదా వేసింది.
కుంభమేళాలో వ్లాగర్లు తీసిన ఫోటోలు, వీడియోలతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో గతంలో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు ఎనిమిది నెలల పాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట, ఇరు వర్గాల మతాలు వేరైనప్పటికీ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని తిరువనంత పురంలో ఉన్న ఒక హిందూ దేవాలయంలో వీరిద్దరూ సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచి ఈ కొత్త జంట కేరళలోనే నివాసం ఉంటున్నారు.
మోనాలిసా వివాహం చేసుకున్న తర్వాత ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇంకా మైనర్ అని, ఆమెను ఫర్మాన్ ఖాన్ అపహరించా డంటూ మధ్యప్రదేశ్లోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్ ఖాన్పై కిడ్నాప్, తీవ్రమైన పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలోనే తమను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని, మరోవైపు తమ ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందంటూ మోనాలిసా కేరళ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

































