తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం రిలీవ్ చేసింది. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం జూన్ 30తో ముగియనుండటంతో అదే రోజున సంజయ్ జాజు నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారని అధికారిక వర్గాల సమాచారం.
1992 బ్యాచ్ తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు, దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సంజయ్ జాజును ఆయన సొంత కేడర్కు తిరిగి పంపేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా, నాటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సమర్థవంతంగా పనిచేశారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం కేంద్రంలో ఆయనకున్న విస్తృత అనుభవం, పరిచయాలేనని తెలుస్తోంది.
….

































