సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులుగా ఉన్న అశోక్, జంగం నాని పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ ఆటోలో వచ్చి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ జోన్ ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయినట్లు తెలుస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అశోక్, జంగం నానిపై కేసులు నమోదయ్యాయి. ఘటన అనంతరం వీరిద్దరూ పరారీలో ఉండగా, తాజాగా పోలీసుల ఎదుట హాజరై లొంగిపోయారు. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, సాయి కృష్ణ డెడ్ బాడీ మాయంలో కానిస్టేబుళ్లు అశోక్, నాని కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని కేసులో నిందితులుగా చేర్చిన పోలీసులు, సంబంధిత కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. అనంతరం విజయవాడ పోలీస్ కమిషనర్ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఇదే కేసులో ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

































