కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్ (కరవు భత్యం) 3 శాతం పెంచింది. డీఏ పెంపు ప్రతిపాదనలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో డియర్నెస్ అలవెన్స్ రేటు 55 నుంచి 58 శాతానికి పెరిగింది. ఉద్యోగులకు పెరిగిన డీఏ జులై నుంచి వర్తించనుంది. కేంద్రం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు కోటిమందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నది. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతుంది. ఇది జనవరి, జూలైల్లో జరగాల్సి ఉన్నప్పటికీ ఏటా మార్చి, అక్టోబరులో ప్రకటిస్తూ వస్తోంది. ఆలస్యంగా ప్రకటించినా, బకాయిలతో కలిపి జనవరి, జూలై నుంచే చెల్లిస్తారు. ముఖ్యంగా డీఏ సవరణ కోసం ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ను ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఇదే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తుంది. ఈ ఏడాది మార్చిలో కూడా డీఏని 2శాతం పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడు శాతం పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేంద్రం డీఏను సరవించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది.


