బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ బీసీలకు ఎంపీ ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుకు వెళ్తానని ఈటల అనటం తప్పన్నారు. బీసీ రిజర్వేషన్ల పై బీజేపీ చిత్తశుద్ధికి ఈటల వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అవసరమైతే సొంత పార్టీ బీజేపీతో ఈటల కొట్లాడాలని అన్నారు. ఈటల ఫైటర్ అయి ఉండి, గౌరవం తగ్గించుకు నే విధంగా మాట్లాడారని విమర్శించారు. ఉద్యమకారుడు, బీసీ బిడ్డ ఈటల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు దారుణమన్నారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్వాగతిస్తారని, కానీ ఈటల మాత్రం ఎన్నికల తర్వాత కోర్టుకు వెళ్తానంటున్నారని మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లిన వారు సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర వ్యక్తులంటూ వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రాజకీయంగా అవకాశం వస్తుంటే కోర్టుకు పోతామని ఈటల ఎలా అంటారని ప్రశ్నించారు. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న ఆర్డినెన్స్ను బీజేపీ పాస్ చేపించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు మోదీని కలవాలన్నారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బీసీ బిల్లును పాస్ చేయించాలని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచినా పెద్ద తేడా ఏమీ ఉండదని తెలిపారు. జాగృతి టార్గెట్ బీసీ రిజర్వేషన్లు సాధించటమే అని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాదని స్పష్టం చేశారు. 8వ తేదీన కోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై తమ స్టాండ్ చెప్తామన్నారు. పోటీ చేసే అంశంపై తమ నాయకులతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మంచిదే అని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ సీరియస్గా ఫైట్ చేయాలని కవిత సూచించారు.


