రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. గతేడాది మాస్కో పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఇండియా ఖరారైనట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవలే రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పుతిన్ భారత పర్యటన తేదీలు ఖరారు చేస్తున్నట్లు అప్పట్లో ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది డిసెంబర్ 5-6 తేదీల్లో పుతిన్ న్యూఢిల్లీలో పర్యటించనున్నట్లు తాజా సమాచారం.
ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ భేటీ కానున్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా భారీగా టారిఫ్లు విధించిన విషయం తెలిసిందే. ఈ టారిఫ్లతో అమెరికా-భారత్ మధ్య దూరం పెరుగుతుండగా, భారత్-రష్యా మధ్య బంధం మరింత బలపడుతోంది. ఈ క్రమంలో పుతిన్ భారత్ పర్యటన ఆసక్తికరంగా మారింది.2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై యుద్ధం అనంతరం ఆయన భారత్కు రావడం ఇదే తొలిసారి.


