హిందీ భాష విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ , హిందీ భాషలు దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లల నైపుణ్యాలను బలహీన పరుస్తున్నాయన్నారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దుతూ కన్నడ ను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఇంగ్లీష్, హిందీపై అతిగా ఆధారపడటం రాష్ట్రంలోని పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తోందని వ్యాఖ్యానించారు. విద్యా సంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.


