దుబాయ్ లోని ఎడారిలో ఘోరం జరిగింది. రష్యా దేశానికి చెందిన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. మృతులు రష్యన్ క్రిప్టో వ్యాపారి రోమన్ నోవాక్, అతని భార్య అన్నా నోవాక్ గా అక్కడి పోలీసులు గుర్తించారు. మృతుల శరీర భాగాలు ముక్కలుముక్కలుగా నరికివేయబడినట్టుగా తెలిపారు. ప్రతీకారంతోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.పెట్టుబడిదారులతో సమావేశం ఉందని చెప్పి అక్టోబర్ 2న రోమన్ నోవాక్ దంపతులు దుబాయ్కి వెళ్లారు. ఒమన్ సరిహద్దుకు దగ్గరగా హట్టా ప్రాంతంలో ఒక సరస్సు దగ్గర కారు డ్రైవర్ వారిని దింపాడు. అక్కడ నుంచి మరో వాహనంలో బయలుదేరారు. ఆ తర్వాత తాను ఒమన్ సరిహద్దులోని పర్వతాల్లో చిక్కుకున్నానని, తనకు డబ్బులు కావాలని పరిచయస్తులకు రోమన్ నోవాక్ సందేశం పంపించారు.
ఈ క్రమంలో బంధువులు వెతుక్కుంటూ వెళ్లగా సమాచారం లభించలేదు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నొవాక్ ఫోన్ సిగ్నల్ ట్రాప్ చేయగా, ఒకసారి హట్టాలో, ఇంకోసారి ఒమన్లో, మరొకసారి దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో ఉన్నట్లుగా తెలిసింది. ఆ తర్వాత సిగ్నల్స్ పూర్తిగా కట్ అయ్యాయి. అప్పటి నుంచి దంపతుల ఆచూకీ కోసం వెతుకుతుండగా తాజాగా దుబాయ్ ఎడారిలో మృతదేహాలు లభించాయి.దుండగులు భార్యాభర్తల శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికేశారు. అయితే వ్యాపార లావాదేవీల్లో భాగంగానే దుండగులు కుట్ర పన్ని ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు.


